Debate on Triple Talaq

మూడు తలాక్ లపై చర్చ ముస్లిం సమాజాల ప్రగతికి చిహ్నం, వెనుకబాటు తనానికి కాదు 


అక్టోబర్ 19న నేను పనిచేసే అన్వేషి సంస్థ భారతీయ ముస్లిం మహిళా ఆందోలన్ సభ్యురాలు జకియా సోమన్ని వారు మూడు తలాక్ లకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారోద్యమం గురించి మాట్లాడమని ఆహ్వానించింది. ఇది ఆ విషయం పైన గత మూడు నెలల్లో సంస్థ పెట్టిన మూడవ చర్చ. అంతకు నెల క్రితం ఫ్లేవియా ఆగ్నెస్ కూడా వచ్చి ఈ విషయంపై తన అభిప్రాయాలని చర్చకి పెట్టారు. ఆవిడ బి ఎం ఎం ఏ చేస్తున్న ప్రచారోద్యమం అనవసరమని, ఇది హిందూత్వ వాదులకి ఉపయోగ పడుతుందని బలంగా వాదించారు. మామూలుగా 20  మంది హాజరయ్యే ఇటువంటి చర్చలకు జకియా మాట్లాడే రోజు సమయానికి ముందే హాలు నిండేటంత అంతకు ముందు ఎప్పుడూ రాని ముస్లిం స్త్రీలు హాజరయ్యారు. ఆమె అహ్మదాబాద్ లో తన నేపధ్యం, తన అమ్మమ్మ ఇల్లు ఎన్ని సార్లు మత కలహాల్లో దగ్ధ మయింది, తన వైవాహిక జీవితంలో పడిన హింస, గుజరాత్ మారణ కాండతో తానెలా ముస్లిం కమ్యూనిటీ కోసం పని చెయ్యటం ప్రారంభించారో చెప్పారు. తాను గుజరాత్ ఊచ కోత బాధితులకి సహాయం చేసే పనిలో నిమగ్నమయిన తరువాతే తనని తాను ఒక ముస్లిం గా భావించుకోవటం ప్రారంభించానని చెప్పారు. ఆ అవగాహన తన జీవితాన్ని మార్చిందని కూడా చెప్పారు. ఇదంతా చెప్పిన తరువాత తాము చేపట్టిన ప్రచారోద్యమం గురించి, తాము షరియత్ పరిధిలో, ఖురాన్లో చెప్పినట్లు మాత్రమే పురుషులు తలాక్ ఇచ్చే విధంగా ముస్లిం కుటుంబ చట్టాలని మార్చాలని, క్రోడీకరించమని అడిగామని చెప్పారు. దీనికి తమ వద్దకి వచ్చిన అనేక మంది బాధిత ముస్లిం స్త్రీల జీవిత పోరాటాలే కారణమని కూడా చెప్పారు. నల్ల జాతి ఇస్లామిక్ స్త్రీవాది అయిన అమీనా వదూద్ నుండి, షరియత్ పరిధిలో ముస్లిం స్త్రీలు తమ హక్కులు సాధించుకోవాలనే  ముసావా అనే అంతర్జాతీయ ఇస్లామిక్ మానవ హక్కుల నెట్ వర్క్ నుండి తాము స్ఫూర్తి పొందామని చెప్పారు. 

అయితే హాజరయిన ముస్లిం స్త్రీలు జకియా మాట్లాడటం ప్రారంభమైన దగ్గరినుండి ప్రతి నిముషం ఆమెని అడ్డుకున్నారు. ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించారు. ఆవిడకి ఖురాన్ లో, హదీస్ లో ఏమి తెలుసో ప్రశ్నించారు. ఆవిడ హిందూ పురుషుడిని పెళ్లి చేసుకున్నందు వల్ల ముస్లిం కాదని, ముస్లిం లకి ప్రతినిధిగా ఉండటానికి అర్హత కోల్పోయిందని వాదించారు. కొంత మంది మూడు తలాక్ లనేవి కేవలం ముస్లింల వ్యతిరేక ప్రచారం మాత్రమే నని, తాము ఎక్కడా వినలేదని, చూడలేదని అన్నారు. ముస్లిం స్త్రీలకి సరయిన చదువు ఉంటే ఇటువంటి వాటికి బలి కాకుండా ఉంటారని వాదించారు. జమాత్ ఏ ఇస్లాం లో పని చేసిన ఖలీదా పర్వీన్, ముస్లిం స్త్రీలకి పేదరికం, చదువు లేకపోవటం, పితృస్వామ్యం వల్ల సమస్యలు ఉన్నాయని అయితే వీటిని కమ్యూనిటీ లోపలే చర్చించుకోవాలని, కోర్టు కి, ప్రభుత్వం దగ్గరికి వెళ్లి చట్టాల్లో మార్పుల కోసం అడగటం అనవసరమని అన్నప్పుదు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తరువాత అందరూ బయటికి వెళ్లి పది నిమిషాల పాటు జకియా సోమన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసి వెళ్లిపోయారు. వీరందరూ ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ అనే సంస్థకి చెందిన వారని తరువాత తెలిసింది. మర్నాడు మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ కార్యాలయం దారుస్సలాం లో జరిపిన సభలో కొంత మంది ముస్లిం స్త్రీల దుర్భర పరిస్థితుల గురించి ప్రసంగిస్తే మరి కొంత మంది జకియా సోమన్  పైన రకమైన విమర్శలు గుప్పించారు. తాము గనక ఉండి ఉంటే ఆమెకి తస్లీమా నస్రీన్ కి పట్టించిన గతే పట్టించి వుండే వారమని కూడా కొందరు అన్నారని తెలిసింది. ఇటువంటి వారిని పిలిచిన వారిది కూడా తప్పే నని అభిప్రాయ పడ్డారు మరి కొంత మంది. 

అన్వేషి సంస్థ స్త్రీలకి సంబంధించిన కుటుంబ చట్టాలు, వాటిలో మార్పుల గురించి గత ముప్ఫయి ఏళ్ల లో అనేక చర్చలు నిర్వహించింది. 1990 ల మధ్యలో షా బానో వివాదం తరువాత వుమ్మడి పౌర స్మ్రితి వుండాలని అనేక స్త్రీల సంస్థలు వాదించి, దాని నమూనాలు తయారు చేసిన సమయంలో రెండేళ్ల పాటు చట్టం, చట్ట సవరణల గురించి సామూహిక అధ్యయనం జరిపి, వుమ్మడి పౌర స్మ్రితి గురించి మాట్లాడే ముందు కుటుంబ చట్టాల విభిన్నత గురించి తగినంత అవగాహన వుండాలని, స్త్రీలకు న్యాయమంటే ఏకరూప వుమ్మడి చట్టం అవసరం లేదని, వివిధ చట్టాలలో సంస్కరణలు చేసే విధంగా కృషి చెయ్యాలని వాదించి, ముంబై కి చెందిన మజ్లీస్ తో కలిసి స్త్రీవాద సంస్థ లన్నింటికీ ఒక అప్పీల్ ని పంపించింది - వుమ్మడి పౌర స్మ్రితి ముస్లింలని టార్గెట్ చెయ్యటానికి హిందూత్వ వాదులు వాడుకుంటున్నారు కాబట్టి, దాని గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదని, స్త్రీ వాద సంస్థలు ఈ ప్రయత్నం మాను కోవాలని అడిగింది. గత ఇరవై ఏళ్లలో అఖిల భారత ప్రజాస్వామిక స్త్రీల సంస్థ తో సహా అందరూ స్త్రీలకి న్యాయం కోసం వుమ్మడి పౌర స్మ్రితి మార్గం కాదని, ఆయా కుటుంబ చట్టాలలో తగిన మార్పులు చేసుకోవాలనే ప్రజాస్వామిక అవగాహనకి వచ్చారు. 

ఇదంతా వర్ణించటం ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ కి చెందిన స్త్రీలని విలన్లు గానూ, జకియా సోమన్ హీరోయిన్ గా చూపించటానికి లేదా అన్వేషి సంస్థ గొప్పతనం చెప్పుకోవటానికి కాదు. నా ఉద్దేశంలో జకియా సోమన్ పట్ల అక్కడ వ్యక్తమైన వ్యతిరేకత - భారతీయ ముస్లిం సమాజాల్లో కుటుంబ చట్టాల గురించిన చర్చ మెజారిటీ హిందూత్వ వాద నీడలో జరగటం వల్ల జరుగుతున్న దుష్ఫరిణామాలకి ఒక చిహ్నం తప్ప మరేమీ కాదు. ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ మరియు భారతీయ ముస్లిం మహిళా అందోళన్ రెండూ కూడా 1990 ల తరువాత పుట్టినవే. రెండూ కూడా బలంగా ఇస్లాం తమకు కావలిసిన హక్కులు ఇస్తాయని నమ్ముతాయి. అంతే కాదు ఇది కేవలం ఈ రెండు సంస్థల, సంఘటనల అవగాహనే కాదు. హైద్రాబాదు లో పని చేసే అనేక చిన్న ముస్లిం స్త్రీల సంస్థలు, తమ స్త్రీలకి సరయిన చదువు - ముఖ్యం గా ఇస్లాం గురించి - ఉంటే తమ హక్కులు తామే సాధించుకోగలరని, కుటుంబ సమస్యలని పరిష్కరించు కోగలరని, హింసకు వ్యతిరేకంగా పోరాడగలరని భావిస్తాయి. 

అయితే ఏది సరయిన ఇస్లామిక్ అవగాహన, షరియత్ అంటే ఏమిటి, ముస్లిం పర్సనల్ చట్టాలంటే ఏమిటి, ఏ ఏ హక్కులు, అధికారాలు స్త్రీలకి వున్నాయి, అవి ఎవరి ఆధ్వర్యంలో సాధించుకోవాలి, ఎలా సాధించుకోవాల్సిన పద్ధతులపై మాత్రం తీవ్ర బేధాభిప్రాయాలు వున్నాయి. ఇస్లాం మత చట్టాలు అచంచలమైనవి అని ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ వారు వాదిస్తే, చారిత్రిక సందర్భం బట్టి అర్ధం చేసుకోవాలని బిఎంఎంఎ భావిస్తుంది. ముస్లిం పర్సనల్ చట్టాలు షరియత్ నుండే పుట్టాయని కాబట్టి వాటిని ఎవరూ మార్చలేరని, మార్చ కూడదని ఎంజిఎ వాదిస్తే, అవి షరియత్ స్ఫూర్తి రూపొందించిన చేసిన దేశ రాజ్యాంగ చట్టాలని, మారుతూనే వస్తున్నాయని, కాబట్టి వాటిని మార్చుకోవచ్చని బిఎంఎంఎ అంటుంది. పితృస్వామ్యం వల్ల ముస్లిం స్త్రీలు తమకి రావాల్సిన అధికారాలు సాధించుకోలేక పోతున్న్నారని ఖలీదా పర్వీన్ మరియు జాకియా సోమన్ ఇద్దరూ అంగీకరించినప్పటికీ, ఖలీదా తమ సమాజంలోనే పోరాడి సాధించుకోవాలని భావిస్తే జకియా ప్రభుత్వ సహాయం తీసుకోవాలని భావిస్తున్నారు. 

స్త్రీలు ముస్లిం సమాజంలో ఉంటూ పోరాడాలి అనే భావన సాంప్రదాయక ధోరణిగా అనిపించి నప్పటికీ ప్రజాస్వామ్యం కరువైన లౌకికత చేసే చేటు గురించి 1985 తరువాత కలిగిన అవగాహన లో ఇది రాజకీయ రూపం తీసుకుంది కూడా. ఈ విషయాన్ని చర్చించిన పార్థ ఛటర్జీ వంటి రాజకీయ సిద్ధాంత కర్త మైనారిటీ సమాజంలో స్త్రీల పోరాటం గురించి చర్చిస్తూ ముస్లిం స్త్రీలు ఒక పక్క తమ సమాజాలని బయటి సమాజ దాడి నుండి రక్షించుకుంటూ ఇంకో పక్క తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తుందని అన్నారు. గత ముప్ఫయి ఏళ్ల ముస్లిం స్త్రీల పోరాటాలని అర్ధం చేసుకోవటానికి ఈ చట్రం చాలా ఉపయోగ పడుతుంది. ఈ ప్రక్రియలో స్త్రీలు కూడా తమ సమాజ ప్రతినిధులుగా ఎదుగుతున్నారు, అంగీకరించ బడుతున్నారు. ముస్లిం స్త్రీలు తమ హక్కుల గురించి మాట్లాడే స్థాయికి చేరుకోక ముందే తమ సమాజాలలో - విద్య లేక ఆరోగ్యం గురించి - లేదా సమాజాలపై దాడులు - హిందూత్వ దాడులు, పోలీసుల దాడుల గురించి - అనేక సంవత్సరాలు పని చేసి వుంటారు. ఉదాహరణకి భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ గుజరాత్లో ఊచకోతకు గురయిన ముస్లిం ల కోసం పని చెయ్యటమే కాక, ఆ తరువాత కుటుంబ సమస్యల పరిష్కారం కోసం షరియత్ అదాలత్ లని స్థాపించారు. అలాగే స్త్రీల హక్కులని పొందుపరిచే నిఖానామా ని ప్రచారం చేసి అనేక పెళ్లిళ్లలో వాటిని వాడుకునేలా కృషి చేశారు. ఈ ప్రక్రియలో సమాజం మొత్తం, పురుషులతో సహా, వారిని కొంత మేరకు తమ ప్రతినిధులుగా ఒప్పుకుంటుంది.  తమిళ నాడు లో షరీఫా ఖానం తో సహా అనేక మంది ముస్లిం స్త్రీలు నడిపే తమిళ్ నాడు ముస్లిం స్త్రీల జమాత్ దీనికి మంచి ఉదాహరణ. ఇది పుదుకోట్టై లోని పేద ముస్లిం స్త్రీలు కుటుంబ సమస్యలని ఖురాన్ పరిధిలో పరిష్కరించు కుంటూ దురాచారాలకు వ్యతిరేకంగా సామూహికంగా పనిచేస్తున్న క్రమంలో ఏర్పడింది. మొదట్లో పురుష జమాత్ లు వ్యతిరేకించినా క్రమేణా వాళ్ళే కుటుంబ సమస్యల కేసుల్ని వీరికి పంపించటం మొదలు పెట్టారు. 

హిందూత్వ వాదులు ముస్లిం సమాజాలలో జరిగే పోరాటాలని తమ స్వప్రయోజనాల కోసం వాడుకోనంత వరకూ ఈ విషయాలపై పోరాడే స్త్రీలని ఆయా సమాజాలు కష్టం గా నైనా అంగీకరిస్తాయని గత ఇరవయి ఐదేళ్ల ముస్లిం సమాజాల చరిత్ర మనకి అర్ధం చేయిస్తోంది. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన పట్ల హైద్రాబాదుతో సహా కొన్ని చోట్ల వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకత దీని వల్లే పుడుతోంది. వారు నరేంద్ర మోడీ వద్దకి వివాహ చట్టాల మార్పు కోసం వెళ్ళటం అనేది కొందరికి కోపం తెప్పిస్తే, కోర్టుకి వెళ్ళవలసిన అవసరం ఏముంది అన్నది మరి కొందరి బాధ. 'దీనితో భారతీయ జనతా పార్టీకి జుట్టు అందించినట్లు కాలేదా? ముస్లిం సమాజాల పట్ల వ్యక్తమయ్యే అనేక అపోహలని - పురుషులు ఒకరి కన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు పడితే అప్పుడు భార్యలకు తలాక్ ఇచ్చేస్తారు, అసలు వుమ్మడి పౌర స్మ్రితి రావడమే దీనికి పరిష్కారం - బల పరిచినట్లు అవుతోంది కదా?' అనేవి వారికి వస్తున్న విమర్శ. 'అయితే మరి ముస్లిం స్త్రీలు తమ వివాహ చట్టాల్లో మార్పుల కోసం ఎంత కాలం ఆగాలి? కాంగ్రెస్ వున్నప్పుడు చెయ్యదు, బిజెపిని అడగ కూడదు, సమాజ పెద్దలుగా అంగీకరించబడిన ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆ బాధ్యత ఎందుకు తీసుకోదు?' అని బి ఎం ఎం ఏ వేస్తున్న అన్న ప్రశ్నలు ముస్లిం సమాజాల్లో, బయటా కావాల్సినంత చర్చని లేవదీస్తున్నాయి. అంతే కాక 'ముస్లిం స్త్రీలు తమ సమాజంలో ఉంటూ తమ హక్కుల కోసం పోరాడాలి' అన్న సూత్రీకరణకి  'ముస్లిం వివాహ చట్టాలలో షరియత్ ననుసరించి తగిన మార్పులు చెయ్యాలి' అనే అర్ధాన్నిచ్చి కొత్త సవాలు విసురుతున్నాయి. 

భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ మూడు తలాక్ లకి వ్యతిరేకంగా జరుపుతున్న ప్రచారోద్యమం, సుప్రీమ్ కోర్టులో వేసిన కేసు మళ్ళా తలెత్తిన వుమ్మడి పౌర స్మ్రితి గురించిన అనవసర చర్చలో వీగిపోవచ్చు. వారి సర్వేలలో తప్పులు, వారి సభ్యత్వం లో లోపాలు, వారికి చట్టాల గురించిన అజ్ఞానం పరిశీలన లో ముందుకి రావచ్చు. ముస్లిం సమాజాలపై యుసిసి పేరుతో జరిగే దాడిని తిప్పి కొట్టటంలో భాగంగా మనలో కొంతమందికి కూడా వీరిని వ్యతిరేకించాల్సి రావచ్చు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తరువాత భారతీయ జనతా పార్టీ నే ఈ వివాదాన్ని పక్కన పడెయ్యచ్చు. కానీ తమ సమాజంలో ఎప్పటి నుండో నలుగుతున్న సమస్య గురించి అందరు చర్చించేలా చేశారని మాత్రం ఒప్పుకోవాల్సి ఉంటుంది. సుప్రీమ్ కోర్టు తీర్పులకన్నా ఇటువంటి చర్చలే సామాజిక మార్పు కి దారి తీస్తాయి. ఇది ముస్లిం సమాజాల అంతర్గత మార్పులకి, ముస్లిం స్త్రీలు తమ సమాజ ప్రతినిధులుగా ఎదిగే ప్రక్రియకి చిహ్నం. దీనికి హిందూత్వ వాదుల అవకాశం వాద సంస్కరణ అవతారంతో ఏ సంబంధం లేదు. 


Published in Saranga magazine on 10th November 2016 http://saarangabooks.com/retired/2016/11/10/ముందడుగు-ఇది/ (the link no longer works) with the title "ముందడుగు ఇది" 


Comments