Feminism

స్త్రీవాదాన్ని విస్త్రుతార్దంలో చూద్దాం! 

స్త్రీల ఉద్యమాలకూ, స్త్రీవాదులకూ, దళిత బహుజన, మైనారిటీ స్త్రీలూ, వారి సమస్యల పట్ల వున్న అవగాహన, నిబద్ధత పట్ల ఆయా సమూహాలకు చెందిన మేధావులు సందేహాలు వ్యక్తం చేయటం ఇరవై సంవత్సరనుండి జరుగుతోంది. డిల్లి సంఘటన నేపధ్యంలో ఈ విషయం మరింత చర్చనీయాంశం అయింది. వివిధలో సుభద్ర వ్యాసం ఆంధ్ర ప్రదేశ్ లో స్త్రీవాదాన్ని విశ్లేషించే ప్రయత్నం చేసి మంచి చర్చకు తెరతీసింది. ఆమె అంచనా ప్రకారం, ఈ ఇరవయ్యేళ్ళ లో  పరిస్థితి పెద్దగా మారలేదు. ఇక్కడ స్త్రీవాదమూ, స్త్రీల సంస్థలూ ఇంకా అగ్రకుల స్త్రీల పెత్తనం లో కొనసాగుతున్నాయి. ఈ విషయం వారి ప్రచురణల్లోనూ, ఆ ప్రచురణల్లో తీసుకున్నరచయిత్రుల రచనల్లొనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రచురణల్లో దళిత, బహుజన, మైనారిటీ స్త్రీల జీవితాలకూ, సమస్యలకూ, ద్రుక్పదాలకూ స్త్రీవాదం స్థానం ఇవ్వటం లేదని నిర్ధారించారు. ప్రతి పుస్తకంలో తీసుకున్న విషయాలలో ఎంతమంది బహుజన స్త్రీలు వున్నారు, రచయిత్రుల్లో ఎంతమంది ఈ వర్గాలకు చెందినవారు ఉన్నారో చూడటం ఆమె నిర్ధారణకు ఒక ప్రధాన భూమిక.

సుభద్ర తను పరిశీలించిన పుస్తకాలలో ఎక్కువశాతం అగ్రకుల రచయితలే ఉన్నారన్న పరిశీలన సరైనదే. స్త్రీవాదం అందరి స్త్రీల కోసం పనిచేయాలంటే, స్త్రీవాద ఉద్యమాలూ, స్త్రీవాదము దళిత, బహుజన, మైనారిటీ స్త్రీల జీవితాల గురించీ, దృక్పదాల గురించీ చాలా నేర్చుకోవాలని సుభద్ర చెప్పకుండా చేసిన సూచనతో విభేదించడమూ కష్టం. అయితే, ఆయా స్త్రీవాద ప్రచురనలను అంచనా వేయడానికీ,
దానిపై ఆధారపడి ఆంధ్ర ప్రదేశ్ లో స్త్రీవాదాన్ని గురించి ఒక అంచనాకు రావటానికి, సుభద్ర అనుసరించిన ప్రచురణల పరిమిత పరిశీలన సరిపోతుందా?

1970లలలో స్త్రీవాద ఉద్యమం మొదలయినప్పటినుండీ  2013 వరకూ, వివిధ చారిత్రక సందర్భాల్లో వచ్చిన రచనలను ఇటువంటి విశ్లేషణా  చట్రంలో పరిశీలించటం సాధ్యమేనా? ఈ ముప్ఫై ఏళ్ళల్లో స్త్రీవాదం లో ఏ మార్పులూ రాలేదా? ఈ మార్పుల్లో సుభద్ర వంటి దళిత బహుజన మేధావుల పాత్ర ఎలాంటిది? అసలు స్త్రీవాదాన్ని ఆయా సంస్థలకు , గ్రూపులకు కుదించటం సాధ్యమేనా? 

స్త్రీవాదంతో గత మూడు దశాబ్దాలుగా ప్రయాణిస్తున్న అన్వేషి సభ్యురాలిగా నేను సుభద్ర మొదలుపెట్టిన చర్చను ముందుకు తీసుకు వెళ్ళాలంటే, స్త్రీవాదాన్నిఅంచనా వేయడానికి తాననుసరించిన పరిమిత పరిశీలనా చట్రం కాక, మరింత విస్తృతమైన విశ్లేషణా  చట్రం అవసరం అని నాకు అనిపించింది. దానికోసం, స్త్రీవాదం వచ్చిన చారిత్రక సందర్భాన్ని, గత ముప్ఫై ఏళ్లల్లో దళిత ఉద్యమాలనుండీ , దళిత స్త్రీల నుండి వచ్చిన సవాళ్ళను కూడా ఒకసారి గుర్తుచేసుకోవాలి. 1970లలో వచ్చిన స్త్రీవాదులు ప్రధానంగా అగ్రకులలకి చెందినవారే అన్నది చారిత్రక సత్యం. అప్పటి స్త్రీవాదులకి, వామపక్ష వాదం నుంచి  విడివడి, స్త్రీల సమస్యలను ప్రత్యేకమని, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రత్యెక పోరాటం అవసరమనీ వాదించటం చారిత్రకంగా ప్రధానమయింది. 1980 ల వరకూ స్త్రీల వ్యతిరేక చట్టాలను మార్చటం, హింసకు వ్యతిరేకంగా  కొత్త చట్టాల కోసం పోరాటాలు జరిగాయి. మథుర, రమీజ బీ వంటి ఆదివాసీ, ముస్లిం స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిపినా, వారి ఆదివాసీ, ముస్లిం అస్తిత్వాలు, వాటితో ముడిపడి ఉన్నసమస్యలు    పెద్దగా ముందుకు రాలేదు.అందరు స్త్రీలకూ పిత్రుస్వమ్యమే ప్రధాన శత్రువనే అవగాహనా ఆ రోజుల్లో  ఉండింది. ఆ సమయంలోనే 'మనకు తెలియని మన చరిత్ర' పుస్తకం వచ్చింది. ఈ అవగాహన, 1990-92 లలో మారవలసి వచ్చింది. మండల కమిషన్ నివేదిక విడుదల, చుండూరు ఊచకోతల సందర్భంలో దళిత ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలూ, బాబ్రి మసీదు కూల్చివేత తరువాత భారత దేశ  లౌకికవాదం పై ముస్లిములు లేవనెత్తిన సందేహాలూ స్త్రీవాదుల్ని కుదిపేశాయి. స్త్రీలంతా ఒకటి కాదనీ, దళిత, ముస్లిం స్త్రీల జీవితాలను కుల వ్యవస్థా, హిందూ జాతీయవాదం శాశిస్తున్నయనే అవగాహన స్త్రీవాదులకు నెమ్మదిగా రావటం మొదలయింది. రిజర్వేషన్లను సమర్ధిస్తూ ఏర్పడిన సమతా సంఘటనలో హైదరాబాదులోని స్త్రీవాదులు భాగం కావటం, చుండూరు
ఘటన గురించి రాయటం, కులం, జెండర్ మధ్య సంబంధాన్ని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించటం 1990-2000 మధ్య జరిగినాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని  ప్రతి ఉద్యమం  -- పౌర హక్కుల ఉద్యమం, నక్సలిజ ఉద్యమం, రాజకీయ పార్టీలు, స్త్రీవాద సంఘాలు, మహిళా ఉద్యమాలూ - అన్నీ కూడా కుల సమస్యని పట్టించుకోవటం ఈ దశాబ్దంలో వచ్చిన ముఖ్య మార్పు. స్త్రీల ఉద్యమాల, దళిత ఉద్యమాల మధ్యలో
దళిత స్త్రీలు ఎక్కడనే ప్రశ్నని చల్లపల్లి స్వరూపరాణి 1990 ల మధ్యలో లేవనెత్తే వరకూ దళిత స్త్రీల ప్రశ్న ఆంధ్ర ప్రదేశ్లో స్పష్టంగా రాలేదు. దళిత స్త్రీలు బాధితులు కారనీ, వారికీ ప్రత్యేక దృక్కోణం ఉందనే విషయాన్నిఆమె చెప్పారు. విషయాలని అర్ధం చేసుకోవటానికి, అప్పటికున్నపిత్రుస్వమ్యాన్ని కేంద్రంగా చేసుకున్న స్త్రీవాద చట్రాన్ని ప్రశ్నించడం ఆంధ్ర ప్రదేశ  స్త్రీవాదులలో అప్పుడే మొదలయింది. సూసి తారు, కల్పనా కన్నబిరాన్ ఇటువంటి సందర్భంలోనే తమ తమ సందేహాలను సిద్ధాంతీకరించారు. 2000 నుండి దళిత, ముస్లిము, బహుజన స్త్రీలు స్త్రీవాదాన్ని కుదిపి వేసి, దాన్ని పునర్నిర్వచిస్తున్నారు. సుభద్రతో సహా, చల్లపల్లి స్వరూపరాణి, గోగు శ్యామల, వినోదిని, షాజహానా, జాజుల గౌరీ, సూరేపల్లి సుజాత వంటి అనేక సాహితీ-సిద్ధాంతవేత్తలు తమ తమ రచనలన్లో - కుటుంబం, భూమి, ఇల్లు, కమ్యునిటీ, హింస, హక్కులు, ప్రాంతం, రాజకీయాలు, పంచాయితీలు, మతము - వంటి అనేక విషయాలని తమదైన స్త్రీవాద దృక్పధంలో విశ్లేషించి వాటిని చూడవలసిన ద్రుక్పదాలని పునరాలోచించేలా  చేస్తున్నారు. అప్పటికే, 1990 లలలో కుల సమస్య గురించి ఆలోచించటం మొదలుపెట్టిన అన్వేషి సంస్థ నుండి గోగు శ్యామల 'నల్లపొద్దు' సంకలనాన్ని తీసుకొచ్చారు. 2000 తరువాత, మట్టిపూలు వంటి దళిత, బహుజన, మైనారిటీ స్త్రీల రచయిత్రుల వేదికలొస్తే, ఇంకో పక్క దళిత స్త్రీ శక్తి వంటి దళిత స్త్రీల హక్కుల సంఘాలు కూడా వచ్చాయి. గోగు శ్యామల, దళిత  రాజకీయవేత్త సదాలక్ష్మి జీవితచరిత్ర 'నేనే బలాన్ని' అనే పుస్తకం రాసారు. దళిత స్త్రీలు స్త్రీవాదాన్ని విస్తృతం చెయ్యటమే కాక, బలంగా, లోతుగా విశ్లేషిస్తున్నారు . అన్వేషి వంటి స్త్రీవాద పరిశోధన కేంద్రాలు, దళిత, మైనారిటీ సమస్యల పరిశోధనకై ప్రత్యెక విభాగాలు ప్రారంభించి, అనేక రకాల పరిశోధనలు జరగడంలో తోడ్పడుతున్నారు.

ఈ రకమయిన విస్తృత విశ్లేషణా  చట్రంలో చూసినప్పుడు, స్త్రీవాదానికి, దళిత బహుజన స్త్రీల ద్రుక్పదాలకీ మధ్య ఉన్న  సంబంధం ఎప్పుడూ ఒకే రకంగా లేదనీ, దృక్పదాలు మారుతున్న క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లో  స్త్రీవాదం రకరకాలుగా  స్పందిస్తూ వచ్చిందనీ అర్ధమవుతుంది. అప్పుడు, అంటే  1990ల ముందు వచ్చిన రచనలనీ, తరువాత వచ్చిన రచనలనీ, సంఘాల, గ్రూపుల కార్యాచరణని కూడా వేరుగా చూడాలి. అగ్రకుల స్త్రీలు రాసిన వయినా సరే, వాటిలో దళిత, మైనారిటీ, ఆదివాసీ స్త్రీల ప్రత్యెక చరిత్రలనూ, జీవితాలనూ, ద్రుక్పదాలనూ పరిగణనలోకి తీసుకున్నయా, ఎంతమేరకు తీసుకున్నయనే ప్రశ్న వేసుకోవాలి. స్త్రీవాదాన్నినిర్వచించే విశ్లేషణ చట్రంలో, ఆయా సంఘాల, గ్రూపుల కార్యాచరణలో, దళిత, అదివాశీ, మైనారిటీ స్త్రీల సిద్ధాంతాలకూ, రచనలకూ ఎటువంటి పాత్ర ఉందనే ప్రశ్న కూడా అడగాలి. ఈ దృక్పధంలో సుభద్ర ప్రస్తావించిన అన్వేషి పుస్తకం స్త్రీవాద రాజకీయాలూ- వర్తమాన చర్చలు సంకలనం గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. సుభద్ర అంచనా ప్రకారం, ఈ సంకలనంలో శ్యామల గారు రాసిన ఒక్క వ్యాసం తప్ప మిగిలినవన్నీ అగ్ర కుల స్త్రీల జీవితాల చుట్టూ, వారి సమస్యల గురించి మాత్రమే ఉన్నాయి.  అన్వేషి ఈ సంకలనంలో 1990 ల తరువాత స్త్రీవాద సిద్దంతాలలో వచ్చిన కొత్త చర్చలని (స్త్రీల ఉద్యమాలు, న్యాయవ్యవస్థలు, చరిత్ర, అభివృద్ధి రంగం, భూమి హక్కులు, జాతీయతవాదం, ఆరోగ్యం మొ..) పాఠకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో కొన్ని ఇంగ్లిష్ లో వచ్చినవి తెలుగులోకి అనువదించి, కొన్నితెలుగు లో రాసిన పరిశోధనా వ్యాసాలు కలిపి
ఈ పుస్తకాన్ని వేయటం జరిగింది. ఈ సంకలనం కూర్పు 1990 లలో మొదలయ్యి,  పూర్తి కావటానికి దాదాపు పది సంవత్సరాలు  పట్టడంతో సుభద్ర విమర్శ కొంత సరయినదే అనిపిస్తుంది. అయితే, విషయ పరిశీలనకు వచ్చినప్పుడు, ఆ విమర్శకున్న పరిమిమితులు కూడా అర్థమవుతాయి. ముందుగ తెలుగు వ్యాసాలు ఏమి చర్చిన్చాయో తెలుసుకుందాము. సజయ వ్యాసం భూమి కోసం బహుజన స్త్రీలు, దళిత
స్త్రీలు, ఆదివాసి స్త్రీలు చేస్తున్న పోరాటాల గురించి, వారి గొంతుల ద్వారా చర్చించి, ఆ పోరాటాల ఫలితాలు అగ్రకుల పితృస్వామ్యం వల్ల  ఏ విధంగా వారి కందకుండా పోతున్నయనే విషయాన్ని చర్చిస్తుంది. లలిత వ్యాసం ప్రపంచీకరణ  నేపద్యంలో పేద స్త్రీల కోసమంటూ నడిపిస్తున్న పొదుపు కార్యక్రమాలు, ఏ రకంగాను వారి స్వశక్తిని పెంపొందించడం లేదనీ, జిల్లా యంత్రాంగానికి వీరిమీద ఇంకా నియంత్రణ కల్పించేటట్లు ఈ కార్యక్రమాలు  రూపొం దించ బడ్డాయని, పోరాడే సత్తా వున్న దళిత స్త్రీలను వీటిల్లోకి రానివ్వకుండా చేస్తున్నారని చెప్పారు. ఇక  తెలుగేతర స్త్రీవాద వ్యాసకర్తల దగ్గరికి వస్తే, వందన సోనల్కర్ వ్యాసం లో అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును ప్రవేశ పెడుతూ చేసిన వాదనల నేపధ్యంలో స్త్రీవాదులు రిజర్వేషన్లును, వుమ్మడి పౌర చట్టం వంటి పౌరసత్వ హక్కులను చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విషయాల పట్ల మహారాష్ట్రలోని దళిత స్త్రీల సంఘాల వాదనలు, వాటిలో కూడా వస్తున్న మార్పులను కూడా చర్చించారు. స్తీవాదులంటే ఎవరు, ఏ ఏ సామాజిక నేపధ్యా ల నుంచి  వచ్చారు, వారి ద్రుఖ్పదాలు ఏర్పడటంలో దాని పాత్ర ఆవిడ చర్చిస్తారు. ఆవిడ ఔ రంగాబాద్
లోని అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో సావిత్రి బాయి విమెన్స్  స్టడీస్ సెంటర్ డైరెక్టర్. ఆ సెంటర్ లో చేరే గ్రామీణ విద్యార్ధుల కోసం మరాఠీ లోను ఇంగ్లీష్ లొనూ   బోధిస్తూ, అంబేద్కర్ దృక్పధాన్ని స్త్రీవాద చర్చలను కలిపి ముందుకు తీసుకువెళుతున్న ఆర్ధిక శాస్త్రవేత్త వందన సోనాల్కర్ . ఫ్లావియా అగ్నెస్, బాబ్రీ మస్జిద్ తరువాత చెలరేగిపోయిన హిండుత్వవాద నేపధ్యంలో స్త్రీల ఉద్యమం తన ఎజెండా పునర్ నిర్వించుకో వాలని   వాదిస్తారు. ముస్లిము  స్తీల, ముస్లిం కమ్యునిటీ కున్న ప్రత్యక పరిస్థితులని అర్ధం చేసుకోలేని నేపధ్యంలో అది హిందూ స్త్రీల ఉద్యమంగా మిగిలిపోతుందని అంటారు. ఆవిడ దేశంలోనే ప్రసిద్ధి చెందినా మైనారిటీ హక్కుల కార్యకర్త, సిద్ధాంతకర్త కూడా. ముస్లిం స్త్రీల హక్కుల గురించి పనిచేయడమే కాక, క్రైస్తవ వివిహ చట్టంలో మార్పుల కోసం అపారమయిన కృషి చేసిన వారు ఫ్లావియా ఆగ్నెస్. వీటన్నిటిని మించి,  గోగు శ్యామల తన వ్యాసంలో, దళిత స్త్రీల అనుభవాలనుండి, విద్య ఆరోగ్యం, హింస వంటి స్త్రీవాదులు లేవనెత్తిన సమస్యలను వేరే (జోగినుల, అట్టడుగు దళితస్త్రీల) కోణాల నుండి, మరింత లోతుగా ఆలోచించాల్సిన అవసరముందో విస్తృతంగా చర్చిచ్చారు . కుల పిత్రుస్వామ్యాన్ని అర్ధం చేయించటంలో, అంబేద్కర్ దృక్పధాన్ని ముందుకు తీసుకు వెళ్ళటంలో స్త్రీవాద ఉద్యమాలకి, సంస్థలకి ఈ వ్యాసం ఎంతో ఉపయోగపడుతుంది.
అందరిని ఆలోచింపచేస్తుంది.

విషయ పరిశీలన తరువాత, కొంతమంది రచయితలు 1990 ల తరువాత ఆయా ప్రశ్నలను తమ తమ కార్యరంగాలలో జోడించు కోవడానికి  కృషి చేస్తున్నవారు అని స్పష్టంగా ఈ పుస్తకంలో తెలుస్తుంది. భారత దేశంలో స్త్రీవాదాన్ని ముందుకు  తీసుకెళ్ళాలంటే, అంబేద్కర్ కులము, జెండర్ కలిపి విశ్లేషించిన విధానాన్ని అలవర్చుకోవాలి, అనే వందనా సోనల్కర్వి వాదన, ముస్లిం స్త్రీల పరిస్థిని అర్ధం చేసుకోవాలంటే ఇస్లాం మతం గురించి కాక 1990 ల తరువాత హిందూత్వవాద  భావజాలాన్ని, వుమ్మడి పౌరసత్వ రాజకీయాలనీ అర్ధం చేసుకోవాలనే ఫ్లావియా
వాదనా దీనికి తార్కాణం. అన్నిటి కన్నా ముఖ్యంగా, తెలుగులో ఉన్న అతికొద్ది దళిత స్త్రీవాద వ్యాసాల్లో ఒకటైన శ్యామల వ్యాసం పైన పెద్ద ఎత్తు  చర్చ జరగాల్సిన అవసరం వుంది.

అయితే, ఇటువంటి విషయ పరిశీలన జరగటానికి, ఇంతకు ముందు  చెప్పినట్లు విశ్లేషణ చట్రాన్ని విస్తృతం చేసుకోవటం చాల అవసరం. ముప్ఫయ్యేళ్లలో  దళిత ఉద్యమ ఫలితంగా, ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ఉద్యమాలతోపాటు, స్త్రీవాద ఉద్యమం గూడా కుల సమస్యను అనివార్యంగా సీరియస్ గా తీసుకోవటం మొదలయిందని గుర్తించటం అవసరం. అలా గుర్తించిన స్త్రీవాదం గురించిన ప్రశ్నలను మార్చటం కూడా  అవసరం. ఇంకా లోతుగా, నిశితంగా అడగటం మరీ అవసరం.  స్త్రీవాదం కొన్ని వర్గాల, కులాల స్త్రీలకూ, కొన్ని సంస్థలకూ, గ్రుపులకూ పరిమితం కాకుండా ఉండాలని, రాజకీయంగా జీవించి ఉండాలని  ఆశించే వారికి, అగ్రకులంలో పుట్టినవారికైనా, దళితులుగా నిర్వచించు కున్న వారైనా  - అందరికీ ఇది ముఖ్యం, అవసరం.

ఈ చర్చకు తెరతీసిన సుభద్రకు అభినందనలు తెలుపుతూ,
సునీత
సీనియర్ ఫెలో, అన్వేషి.

Comments