Vysya attak on Ilaiah


ఐలయ్య గారు వైశ్యుల గురించి రాసిన ‘కోమట్లు: సామాజిక స్మగ్లర్లు’ పుస్తకం చుట్టూ గత కొద్ది రోజులుగా నడుస్తున్న నిరసనలు, వివాదం గురించి కొంత లోతుగా విశ్లేషించాల్సిన అవసరం వుంది. పుస్తకానికి స్పందనగా ఆయనపై దాడికి దిగటం లేదా ఆయన్ని చంపుతామని బెదిరించటం అనాగరికతని, భావ దారిద్రాన్ని సూచిస్తుంది తప్ప ఆలోచనని కాదు. రోడ్లపై, కోర్టుల్లో తమ రాజకీయ బలాన్ని చూపించుకుంటున్న కోమటి కమ్యూనిటీ పుస్తకం పట్ల తమ ఆలోచనలని వ్యక్తీకరించి మేధో మార్గాన్ని కూడా పట్టక తప్పదు. 

ముందుగా కొన్ని వాస్తవాలు. ఈ ఇరవయి పేజీల పుస్తకం 2009 లో కింది కులాల దృష్టికోణం నుండి కుల సమాజం ఎలా కనిపిస్తుందని ఐలయ్య గారు రాసిన “హిందూ అనంతర భారత దేశం” లోని ఒక అధ్యాయం. అన్ని కులాల గురించి చర్చించే అధ్యాయాల మధ్యలో ఈ అధ్యాయం కూడా చదివినప్పుడు అది ఒక అపనిందలా స్ఫూరించదు. నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో క్రింది కులాలకి ఆస్తి లేకపోవటం వారి తప్పు కాదని, కుల వ్యవస్థలో ఆస్తి కొన్ని కులాలకు పరిమితం అయ్యిందని అర్ధం చేయిస్తుంది. ఈ పుస్తకం మొత్తం తెలుగులో వచ్చినపుడు ఏ వివాదం చెలరేగ లేదు. ప్రస్తుతం దాన్ని ముక్కలు ముక్కలుగా ప్రచురించటం వల్ల అధ్యాయాల మధ్య వుండే లింకులు పోయి ఈ ఇరవయి పేజీల పుస్తకం, ముఖ్యంగా దాని  శీర్షిక, కోమట్లకే కాక, కుల పరమయిన విభజనలు వద్దనే లౌకిక వాదులకి కూడా కొంత చిరాకు, ఆగ్రహాన్నితెప్పించింది. 

ఇటువంటి శీర్షికతో వున్న చిన్న పుస్తకం తమ కమ్యూనిటీని అవమాన పరిచిందని కోమట్లు బాధ, ఆక్రోశం అనేక రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా పుస్తక శీర్షికని విమర్శించారు. ఇది కాక,, కోమట్లని (మాత్రమే) ‘సామాజిక స్మగ్లర్లుగా’ వర్ణించే పుస్తక విశ్లేషణతో చాలా సమస్యలున్నాయి. అన్ని కమ్యూనిటీలు, కులాల్లో వ్యాపార సంస్కృతి ప్రబలిపోయిన ఈ కాలంలో కేవలం కోమట్లు మాత్రమే వ్యాపారంలో మోసం చెయ్యటం ద్వారా ఆస్తులని కూడబెట్టుకుంటున్నారని అనటం అసంబద్ధంగా వుంది. అలాగే స్వాతంత్ర్యం తరువాత భారత దేశంలో వ్యాపార సంస్కృతి లో తీవ్ర మార్పులు వచ్చాయని హరీష్ దామోదరన్ వంటి పాత్రికేయులు రాశారు.

జమిందారీ రద్దు వల్ల భూములు పొందిన వ్యవసాయ ఆధారిత ఆధిపత్య శూద్ర కులాలు ఆ లాభాలని వ్యాపారం, పరిశ్రమల  లోనికి మళ్ళించాయని, అలాగే రాజకీయాలలోకి ప్రవేశించటం వల్ల ప్రభుత్వ వనరులు కూడా వారికి అందుబాటులోనికి వచ్చాయని వీరే 1990 ల తరువాత పెద్ద వ్యాపారవేత్తలుగా రూపుదిద్దుకున్నారని అయన విశ్లేషించారు. ప్రస్తుత తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో వున్న 25 మంది అతి పెద్ద కాంట్రాక్టర్లలో ఒక్కరు మాత్రమే కోమటి కులానికి చెందిన వారు. మిగిలిన వారు ఈ ఆధిపత్య శూద్ర కులాలకు చెందినవారే. ఇలా తమిళనాడులో గౌండర్లు, నాదార్లు, తెలుగు ప్రాంతాల్లో రెడ్డి, కమ్మ కులాల వారు పెద్ద పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగారు. కేరళ లో ఈడవ, తెలుగు ప్రాంతాల్లో యాదవులు, పద్మశాలులు వంటి మరి కొన్ని కమ్యూనిటీల నుండి  కూడా సంప్రదాయ వృత్తుల ఆధునికీకరణ వల్ల వ్యాపార వేత్తలుగా ఎదుగుతున్నారు. అంతే కాక భారత దేశంలో పెట్టుబడి దారి విధానం రాక ముందు డబ్బు కున్న అర్ధం, అది ప్రబలిన తరువాత పూర్తిగా మారిపోయింది. డబ్బుని ధార్మిక అవసరాల కోసం లేక దాచి పెట్టుకోవటం వల్ల ఏ ఉపయోగం ఉండదు. కనిపించని శ్రమ దోపిడీ, కొత్త రకాల అసమానతల్ని సృష్టించే ఈ వ్యవస్థలో ధనాన్ని ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా సరే, దాని వల్ల ఉద్యోగాలు, డబ్బు మళ్ళా సృష్టించబడతాయి. ఇటువంటి వ్యవస్థలో బనియా కమ్యూనిటీ లేదా కోమట్ల ధనం, అంబానీది, అదానీది అయినా సరే, ఆ కమ్యూనిటీలో మాత్రమే ఉండిపోవటానికి అవకాశాలు తక్కువ.

అయితే ఇంత మార్పు జరిగినా సరే, వ్యాపార శ్రేణుల్లో కోమట్ల, మరియు సంప్రదాయ వ్యాపార శ్రేణులయిన మార్వారీలు, గుజరాతీ జైన్లు, ఫారసీలు, పంజాబీ ఖాత్రీలు, బోరా ముస్లింల ఆధిపత్యం ఇంకా కొనసాగుతోందనే విషయం ఒప్పుకోక తప్పదు. ఇలాంటి ఒక శ్రేణి అయిన కోమట్లు, మిగిలిన వారితో సమానంగా కాకపోయినా, భారత దేశంలో పరపతి, ఆస్తి, ఆర్ధిక బలం వున్న ఒక కమ్యూనిటీ అన్నది ఒక వాస్తవం.

కానీ వైశ్యులందరూ కులానికి ఒకటి కావచ్చు కానీ, దేశ వ్యాప్తంగా కలిసికట్టుగా వుండే కమ్యూనిటీ కాదు. ఉత్తర భారత వ్యాపార శ్రేణులంత రాజకీయ పలుకుబడి, బలం ఈ ప్రాంత కోమట్లకి లేకపోవటం వల్ల మార్వారీలు ఇక్కడికి రావటాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తారు. ఎక్కువగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే గ్రామాల, పట్టణాల కోమట్లకి  ఉత్తర భారత దేశ వ్యాపార శ్రేణులు వస్తే తాము బ్రతకలేమని భయం. అలాగే, పెద్ద వ్యాపారాలు చేసే కోమటి/వైశ్య కుటుంబాలు తక్కువ, చిన్న, అతి చిన్న వ్యాపారాలు చేసుకునే శాతం ఎక్కువ. అందుకే చాలా మంది మిగిలిన ఆధిపత్య కమ్యూనిటీల లాగే వీరు కూడా సాంప్రదాయ వృత్తిని వదిలి చదువు, ఉద్యోగాలలో కి మళ్లుతున్నారు. జనాభా పెద్దది కాకపోవటం వల్ల రాజకీయ ప్రాబల్యం కూడా తక్కువే. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సపోర్టు ఇవ్వటం మామూలే.

ఇంత అంతర్గత అంతరాలు వున్న కోమట్లకి ఐలయ్య గారి పుస్తక ప్రచురణ బహుశా ఒక తాటిపైకి రావటానికి పనికొచ్చి నట్లుంది. భారత దేశ వ్యాప్తంగా వున్న బనియా/వ్యాపార శ్రేణుల సంస్కృతిపై ఎక్కుపెట్టిన బాణాన్ని కేవలం తమపై ఎక్కుపెట్టిన బాణంగా మాత్రమే భావించి, శీర్షిక తప్ప చదవని పుస్తకాన్ని తగులపెట్టటం, రచయిత దిష్టిబొమ్మల్ని తగల బెట్టటం, అలాగే అయన పోస్టర్లపై నడిచి అవమాన పరచటం, కేసులు పెట్టి, కారుపై రాళ్ళేసి, చంపాలని ఫత్వా జారీ చేయటం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈ చర్యలన్నీ ఉక్రోశాన్ని, ఆవేశాన్ని, అభద్రతని మాత్రమే సూచిస్తున్నాయి. 

ఇవి కాక వేరే రకమైన స్పందన సాధ్యమేనా? అభ్యంతరకరమయిన పుస్తక శీర్షికని కాస్సేపు పక్కన పెడదాం. పుస్తకాన్ని కేవలం ఐలయ్య గారి భావాలుగా కాక, అణగారిన కులాల్లో కోమటి సమాజమంటే వుండే భావాల వ్యక్తీకరణగా చూద్దాం. అప్పుడు తమ గురించి మిగిలిన సమాజాలు, ఏదోస్థాయిలో, ఎందుకీ విధంగా ఆలోచిస్తున్నాయనే విషయాన్ని కోమటి సమాజం ఒక సీరియస్ సమస్యగా తీసుకోక తప్పదు. అలా అని పుస్తక విషయంతో, విశ్లేషణతో ఏకీభవించాలని లేదు. ఇంకా చెప్పాలంటే, ఐలయ్య గారు ఆధిపత్య శ్రేణుల గురించి తీవ్ర పద జాలంతో రాసిన వారిలో మొదటి వారు కాదు. గత రెండు వందల ఏళ్లలో, అణగారిన కులాల నుండి వచ్చిన విమర్శకులు, దార్శనికులు - జోతిబా ఫులే కావచ్చు, లేదా రామస్వామి పెరియార్ కావచ్చు, వర్ణ వ్యవస్థలో ఆధిపత్య స్థాయిలో వుండే కులాలని దోపిడీ దారులు గానో లేక తిని కూర్చునే వారు గానో లేదా బలిసిన కులాల గానో వర్ణించారు. 1990 ల నుండి బ్రాహ్మణీయ వ్యవస్థ గురించిన విమర్శ బ్రాహ్మణులపై దృష్టిని కేంద్రీకరిస్తూ వచ్చింది. ఈ విమర్శనాత్మక రచనలు కుల వ్యవస్థ లో అణగదొక్క బడే వారికి, దాని ఫలాలు ఆస్వాదించే వారికి వున్న విభేదాల కి ప్రతీకగా అర్ధం  చేసుకున్నప్పుడు, కోమటి సమాజం నుండి ఆలోచనాత్మక స్పందన కూడా అవసరమనే నిర్ధారణకు రాక తప్పదు.

ఒక రకంగా ఈ దురదృష్టకర వివాదం కోమటి సమాజానికి తాము ఎవరు, ఏమిటి, తాము సమాజానికి ఏమి చేసాము, చెయ్యలేదు అని ఆలోచించుకోవటానికి, ఇతర సమాజాలకి వివరించి చెప్పటానికి అవకాశం కల్పించింది. తాము చేసిన సేవ గురించి కమ్యూనిటీ పుస్తక ఆవిష్కరణ కూడా జరిపింది. తమ బలాన్ని నిరూపించుకోవటానికి అనేక ప్రదర్శనలు, పాదయాత్రలు కూడా జరుపుతోంది. ఈ రకంగా రాజకీయ బల ప్రదర్శన చేస్తున్న కమ్యూనిటీ తమపై విమర్శకు సమాధానమిచ్చే మార్గాల గురించి కూడా ఎందుకు ఆలోచన చేయకూడదు? చేస్తే ఈ వివాదానికి పరిష్కారం దొరుకుతుందేమో?

అయితే అటువంటి ఆలోచనకి కోమటి నాయకత్వం ఆసక్తి చూపిస్తున్నట్లు లేదు. భావోద్వేగాలపై, ఐలయ్య గారిని ఎలాగైనా శిక్షింప చెయ్యటం పైనే ద్రుష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నిరసనలు గమనిస్తే, పైకి కనిపించని తమవైన రాజకీయ ప్రయోజనాలు వీటి వెనుక ఉన్నాయని, వాటికి ప్రస్తుత వివాదంతో సంబంధం లేదని, ఇంకా చెప్పాలంటే ఈ ఆందోళన నడిపించే రాజకీయ శక్తులు కూడా వేరే వున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి.

మరో పక్క ఈ భావోద్వేగ నిరసనల్లో కోమట్లలో వున్న పేద గుమాస్తాలు, చిన్నా, చితకా వ్యాపారులు భాగమయ్యారు. వీరందరూ పుస్తకం చదివి, ఐలయ్య గారి పై కోపంతో పాల్గొన్నారని అనుకోవటం కొంచెం కష్టం. ప్రభుత్వం తమకి ఏమీ చేయట్లేదనే కోపం కొంత కారణమయితే, మరి కొంత నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల కలిగిన నష్టం, ఉద్యోగాలు లేకపోవటం  కూడా దీనికి ఆజ్యం పోసిందని అనుకోవచ్చు. ఇలా పాల్గొంటే ప్రభుత్వాలు తమని పట్టించుకుని ఎంతో కొంత వ్యక్తిగత ప్రయోజనాలు చేకూరుతాయని భావించటం కూడా కారణం కావచ్చు.  అయితే, వీరికి కూడా ప్రభుత్వం, పోలీసుల సహకారంతో ఐలయ్య గారి దిష్టిబొమ్మలు, పుస్తకం కాపీలు తగులబెట్టడం తేలికే గానీ, పై సమస్యల తో సతమతమవుతున్న తమ గురించి ఏమి చేశారని రాజకీయ నాయకులని, ప్రభుత్వాలని నిలదీయటం అంత సులువు కాదు. ఆయా అసంతృప్తులని వ్యక్తం చెయ్యటానికి ఐలయ్య గారి పుస్తక  వివాదం వీరికీ అవకాశం ఇచ్చినట్లుంది. 

కోమటి నాయకులు ఈ వివాదాన్ని ఎటు తీసుకెళ్లినా గానీ, సాధారణ కోమటి ప్రజలు ఐలయ్య గారి గురించి కొన్ని విషయాలు  తెలుసుకుని ఉంటే మంచిది. అయన రాసిన పుస్తకం ఇది మొదటిది కాదు. గత ముప్ఫయి ఏళ్ళకి పైగా కుల వ్యవస్థలో కూరుకు పోయి కమ్యూనిటీలుగా గానీ, వ్యక్తులుగా గానీ తమకు తాము ఆలోచించుకోలేని స్థితిలో వున్న సమాజాలని తమ గురించి తాము స్వయంగా నిచ్చెనమెట్ల వ్యవస్థ కి అతీతంగా ఆలోచించుకోవాలని అయన రచనలు చేస్తున్నారు. ఈ వ్యవస్థలో కోమట్లు బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని అంగీకరించి తాము కేవలం వ్యాపారాలకు పరిమితమయ్యి సంప్రదాయ పాత్రని మాత్రమే పోషిస్తున్నారని ఆయన విమర్శ. అన్ని కుల సమాజాలు తమకిచ్చిన సంప్రదాయ పాత్రలని పునరాలోచించుకోవాలని ఆయన ఉద్దేశం. ఇటువంటి రచనల వల్ల తన కమ్యూనిటీ నుండే అయన విమర్శలని ఎదుర్కొన్నారు. కోమట్లు, తమకున్న వనరులతో, సామాజిక బలంతో, ప్రస్తుతం పోషిస్తున్న పాత్ర కంటే, ప్రగతిశీల పాత్ర పోషించాలని,  అలాగే కుల వివక్ష చూపించ కూడదని అయన సూచన. సమాజంలో మరింత ప్రగతి శీల పాత్రని పోషించటం కోమట్లకి, వైశ్య వ్యాపార శ్రేణులకు కొత్తేమీ కాదు. జాతీయ ఉద్యమంలో, సంస్కరణ ఉద్యమంలో విద్య సంస్థలు స్థాపించి, హాస్టళ్లు నడిపి, అటువంటి పాత్ర వాళ్ళు పోషించారు. కొంత మంది ఇప్పటికీ పోషిస్తున్నారు.

ప్రస్తుత వివాదం వల్ల ఎక్కువమందికి తెలియని ఈ చిన్న పుస్తకానికి పబ్లిసిటీ వచ్చి మరింత మంది చదవటానికి అవకాశం కలిగింది. ముందు ముందు కోర్టు ద్వారా పుస్తకాన్ని బాన్ చేయిస్తే, మరింత ఎక్కువమంది చదివే అవకాశం వుంది తప్ప, ఈ భావ వ్యాప్తిని అడ్డుకుందామనే కోమటి నాయకుల లక్ష్యం మాత్రం నెరవేరదన్నది వాస్తవం. కుల వ్యవస్థ గురించి ఐలయ్య గారి భావాలతో ఏకీభవించే వారిలో, కోమట్లతో సహా, అన్ని కులాల వ్యక్తులు వున్నారు. వీరిలో ఎంత మందిని కోమట్లు రాయకుండా ఆపగలరు? దీని కన్నా, ఎంతో కాలం నుండి సమాజం గురించి ఆలోచిస్తున్న, రచనలు చేస్తున్న ఐలయ్య గారి వంటి వ్యక్తుల నుండి విమర్శ వచ్చినప్పుడు, కొంత బాధ కలిగించినా, దాన్ని వ్యక్తిగతం గానో, కుల ద్వేషంగానో తీసుకోకుండా తమ గురించి తాము ఆలోచించటానికి అవకాశంగా తీసుకోవటం అవసరం. అటువంటి వ్యక్తులకి దురుద్దేశాలు ఆపాదించి, అవమాన పరిచినంత మాత్రాన ఆయా భావాల వ్యాప్తి అడ్డుకోవటం అసాధ్యం. ప్రస్తుత వివాదంలో కోమట్లు ఐలయ్య గారి పుస్తకాన్ని బలవంతంగా అడ్డుకోవడంపై, లేదా ఆయనకి శిక్ష వేయించటంపై తమ కమ్యూనిటీ శక్తిని మొత్తం ధారపోయకుండా, తమ కమ్యూనిటీ గురించి, తమ సామాజిక పాత్ర గురించి ఆలోచించటం, వేరే వారికి చెప్పటం అత్యంత అవసరం.

ఏ. సునీత, ఆర్ శ్రీవత్సన్
నవ తెలంగాణ వార్త పత్రికలో ప్రచురితమయింది

Comments