Fathers violence as love in popular discourse around inter-caste marriages

 తండ్రి ప్రేమ: కొన్ని ప్రశ్నలు 

దాదాపు రెండేళ్ల క్రితం గర్భవతి అయిన కూతురు అమృత, భర్తతో కలిసి ఆస్పత్రికి చెక్ అప్ కి వెళ్తే, ఆమె కళ్ళ ముందే స్వంత అల్లుణ్ణి చంపించిన మారుతీ రావు కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త విని మన సమాజంలో కొంత మంది దీన్ని తండ్రిప్రేమ కి పరాకాష్ట గా వర్ణించారు. సంవత్సరం నిండని పసికందుని అత్తా మామల అండతో భర్త లేకుండా పెంచుకుంటూ ముఖంలో ఇంకా పసితనం పోని అమృతని ఇద్దరు మనుషుల్ని పొట్టన పెట్టుకున్న రాక్షసి గా చూడాలని, పెళ్ళికి ముందు ఆమెని తీవ్రంగా హింసించిన స్వంత బాబాయి ఆమె గురించి పేలిన అవాకులు చెవాకులు సత్యమని, ఆమె  కుటుంబం నాశనమవటానికి, మారుతి రావు, తమ్ముళ్ళతో కలిసి చేయించిన ప్రణయ్ హత్య కాదని, ఆమె వారికిష్టం లేకుండా దళితుడయిన ప్రణయ్ ని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయమే కారణమని కూడా తీర్పులు చెప్పారు. నిజ జీవితంలో తండ్రి ప్రేమని చవి చూసిన నాలాంటి ఎంతో మంది స్త్రీలకి మా తండ్రుల ప్రేమ నిజమైంది కాదేమో, మారుతి రావు వంటి ఆదర్శ హంతక తండ్రి కోసం అందరు కూతుళ్లు కలలు కనాలేమో, నవలలు రాయలేమో, సినిమాలు తీయాలేమో, రోడ్లమీదకొచ్చి ధర్నాలు చెయ్యాలేమో అన్న అనుమానాలు కలుగ చేశారు. ఆధునిక సమాజంలో మీడియా తననుకున్న విలువలకి ‘అంగీకారాన్ని’ తయారుచేస్తుందన్న నోం చోమ్స్కీ మాటలని గుర్తు చేసుకుంటే, మారుతి రావు ఒక అమూర్త తండ్రి ప్రేమ ఆనవాలుగా,  అంగీకరించాల్సిన నమూనాగా మన ముందుకి ఎందుకు వస్తున్నాడో చర్చించుకోవాల్సిన అవసరం కూడా వెంటనే అర్ధమవుతుంది. 


పిల్లల పెంపకంలో తండ్రి పోషించే పాత్రని 1970 ల వరకూ సోషియాలజీ గాని, ఆంథ్రోపాలజీ గాని, ఇతర సామాజిక శాస్త్రాలు గాని పెద్దగా పట్టించుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీవాద ఉద్యమాలు వచ్చిన తరువాత కుటుంబాల్లో ఎవరెంత పని చేస్తారో, పిల్లల రోజువారీ సంరక్షణ లో తల్లుల పాత్రతో పాటు నెమ్మదిగా తండ్రుల పాత్రని కూడా అధ్యయనం చేసే ఆసక్తి మొదలయింది. సంపాదించటంతో పాటు కొంత మేరకు కొంత మంది తండ్రులు కూడా సంరక్షణలో బాధ్యత తీసుకుంటారని అర్ధమయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ పిల్లల పెంపకం ప్రధానంగా తల్లుల బాధ్యత గానే కొనసాగుతోంది. వారు ఇంద్ర నూయి వంటి ధనిక బ్రాహ్మణ స్త్రీలయినా, రాధిక వేముల వంటి పేద దళిత స్త్రీలయినా. మన దేశంలోనే అనేక కారణాల వల్ల కుటుంబాలని వదిలేసి పారిపోయే తండ్రులు కోకొల్లలు. 40% వరకు తండ్రులు లేని కుటుంబాలే ఉన్నాయని ఒక అంచనా. 


ప్రధానంగా మన సమాజంలో తండ్రుల పాత్ర, వారు బాధ్యత తీసుకున్న సందర్భాల్లో, ప్రధానంగా సంపాదించటం, పిల్లల చదువులకి, పెళ్ళిళ్ళకి బాధ్యత వహించటం మేరకే ఉంటుంది. వారిని ఉత్సాహ పరచటం, వారితో ఆడుకోవటం, వారి చిన్న చిన్న సంతోషాల్లో, బాధల్లో పాలు పంచుకోవటం చాలా అరుదు. వీటికి మించి సామాజిక కట్టుబాట్లని (కులం, వర్గం, కుటుంబ పరువు) అమలుపరిచే బాధ్యత ప్రధానంగా పురుషులు తీసుకోవటంతో తండ్రులు సాధారణంగా నియమాలు, కట్టుబాట్ల అమలులో ఎక్కువ శ్రద్ధ, పిల్లల మానసిక పురోగతిలో తక్కువ గా శ్రద్ధ తీసుకుంటారు. 


అయితే, సమాజం ఆశించే రోబోట్ లానో, రూల్ బాబాయ్ గానో కాకుండా ఎక్కడో అక్కడ వీటిని అధిగమించిన తండ్రులే తమ పిల్లల, ముఖ్యంగా కూతుళ్ళ పురోగతిలో పాత్ర పోషిస్తారని చెప్పటానికి మనకు ఉదాహరణలు వున్నాయి. గోగు శ్యామల, జూపాక సుభద్ర కధల్లో అటువంటి తండ్రులు కన్పిస్తారు. కుల కట్టుబాట్లని కాదని కూతుళ్ళని చదివించే తండ్రులు ఇక్కడ ఔదార్యానికి కాక నిజమయిన ప్రేమకి చిహ్నాలుగా కల్పిస్తారు. కుల పితృస్వామ్యాన్ని ఎదుర్కోవటం మామూలు విషయం కాదు. ఇంకో పక్క కె. లలిత తన పుస్తకంలో తన తాత ఎలా కూతుళ్ళకి పట్టు పరికిణీలు కుట్టించారో, తన తండ్రి ఎంత పనున్నా పిల్లలతో సమయం గడిపి, భాష, సంగీతం నేర్పించటంలో శ్రద్ధ తీసుకునే వారో వర్ణిస్తారు. నా మేరకు నాకు, మా నాన్న, నువ్వెంత వరకు చదువుకున్నా చదివిస్తాను అని చేసిన వాగ్దానం రాజనీతి శాస్త్రంలో డాక్టరేట్ వరకు తెచ్చింది. నాతో సలహా అనేక మంది నా స్నేహితురాళ్ళకి తండ్రులు స్కూలుకి తీసుకెళ్లటం, టిఫిన్ కారియర్ మర్చిపోతే తెచ్చి పెట్టటం, ఎల్టీసీ మీద దేశం చూపెట్టటం నుండి కులాంతర వివాహాలు చేసుకుంటే ముందు బాధపడినా తరువాత మంచిగానే చూసుకోవటం అనుభవమే, అవన్నీ తండ్రి ప్రేమ వ్యక్తీకరణలు. ఇప్పుడు కొంత మంది తండ్రులు కూతుళ్ళకి ఆటలు నేర్పించటం, వారి చదువు కోసం ఇల్లు మారటం, వారి ఎంట్రన్స్ ల కోసం ఊళ్ళు తిరగటం ఇంకా ఎన్నో చేస్తున్నారు. ఇవన్నీ ఆహ్వానించదగ్గ పరిణామాలు.  


అయితే ఇటువంటి తండ్రి కూతుళ్ళ బంధాలని మన సమాజం ఇప్పటికీ తండ్రుల ఔదార్యానికి ఉదాహరణలుగా చూస్తోంది తప్ప, మారుతున్న కాలానికి అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న తండ్రి ప్రేమకి వ్యక్తీకరణాలుగా చూడట్లేదు. తండ్రంటే మన సమాజ ఊహలో ఇప్పటికీ నియమ నిబంధలని  అధికార సమాజ విలువల్ని కుటుంబంలో అమలు చేసి, వాటిని ఉల్లంఘించినపుడు పిల్లల్ని శిక్షించే వాడే తప్ప, పిల్లల సంరక్షణలో, చదువు, పురోగతిలో పాలు పంచుకుని, ఆనందించే వాడు కాదు. సమాజ ఊహల్లో ఇప్పటికీ కూతుళ్ళ పట్ల తండ్రి ప్రేమ శిక్షించగలిగే ప్రేమగానే ఉంటోంది. 


రాజనీతి శాస్త్రంలో ఆధునిక రాజ్యం, ప్రజాస్వామ్యం, సమాజ ఆవిర్భావాలకి మూలంగా చెప్పే 17 వ శతాబ్దపు ‘సామాజిక ఒడంబడిక ’ సిద్ధాంతాలలో కుటుంబంలో నిరంకుశ తండ్రి కుండే పితృస్వామ్య అధికారం మార్పుకి లోనయ్యి కొడుకులు దాన్నుండి విడుదలవ్వటం ప్రజాస్వామ్యం వైపు ఒక ప్రధాన అడుగుగా చదువుకుంటాం. కొడుకులు తండ్రులతో సమాన స్థాయికి చేరగలిగే పరిస్థితి సూత్రప్రాయంగా నైనా వచ్చినప్పుడే, అంటే వయోజనులయిన వారందరినీ సమానంగా గుర్తిస్తేనే, ప్రజాస్వామ్యానికి భూమిక ఏర్పడి ఆధునిక రాజ్యంతో (మగ) ప్రజలు ఒప్పందం చేసుకోగలరని, ఆ క్రమంలోనే హక్కులు వస్తాయని సూత్రీకరించారు. అప్పటి యూరోపియన్ సమాజాల్లో కుటుంబాలపై తండ్రుల అధికారం చట్ట పరంగా, మత పరంగా సంపూర్ణం. 


అయితే కొడుకులకి సమానత్వం ఉండాలని చెప్పిన థామస్ హాబ్స్, జాన్ లాక్ లు కూడా కుటుంబంలో స్త్రీలకి దాని అవసరం లేదని, వాళ్ళు తమ రక్షణ కోసం, పిల్లల పెంపకం కోసం కుటుంబలో పితృస్వామ్య అధికారం క్రింద ఉండటమే మంచిదని, పురుషుల ఔదార్యంపై స్త్రీలు ఆధార పడాలని, భర్తలుగా, తండ్రులుగా పురుషులు వారికి బయటి ప్రపంచంలో ప్రాతినిధ్యం వహిస్తే సరిపోతుందని చెప్పారు. స్వేచ్చా సిద్ధాంతానికి ఆద్యుడని అందరు చెప్పుకునే రూసో అయితే, ఒకడుగు ముందుకెళ్లి స్త్రీలలో చాపల్యం ఎక్కువనీ, వారు కుటుంబంలో ఉంటూ భావి పురుష పౌరులని సిద్ధం చేస్తే చాలని, వారు బయటికొస్తే ప్రజాతంత్ర వ్యవస్థ కూలిపోతుందని సూత్రీకరించాడు. 


ఆధునిక రాజ్య మూలాల్లో ఈ విధంగా సూత్రీకరించబడిన ఈ సర్వసత్తాక తండ్రి పాత్రకి తెలుగు సమాజం మన ముందు పెడుతున్న అమూర్త తండ్రి ప్రేమ నమూనాకు సారూప్యత విదితమే. ఈ నమూనాని మన అంగీకారం కోసం ఇప్పుడెందుకు ముందు పెడుతున్నట్లు? 


భారత దేశ ప్రజాతంత్ర వ్యవస్థ 1950 లో ఏర్పడినప్పుడు స్త్రీలకి సమాన వోటింగ్ హక్కులుండాలేది అందరు ఒప్పుకున్నారు గానీ, కుటుంబంలో వారికెంత మేరకు హక్కులుండాలనేది మాత్రం ఒక పట్టాన ఒప్పుకోలేదు. కుటుంబంలో సమాన హక్కులు లేకుండా వాళ్ళు సమాన పౌరులు ఎలా అవగలరని డా. బి. ఆర్. అంబెడ్కర్ తో పాటు అనేక మంది మహిళా ప్రతినిధులు ప్రశ్నించారు. ఎక్కువగా ఆధిపత్య కులాల హిందూ స్త్రీలపై వుండే నిరంకుశ కుటుంబ నిబంధనలు పోవాలని - పెళ్లి చేసుకునే హక్కు, విడాకులు తీసుకునే హక్కు, ఆస్తి హక్కు ఉండాలని - అప్పుడే వాళ్ళు భారత సమాజంలో సమాన పౌరులుగా మెల్లగ గలరని, మన ప్రజాతంత్ర వ్యవస్థ సరిగ్గా నడుస్తుందని వాదించిన అంబెడ్కర్ ను మొదటి పార్లమెంటులో వ్యతిరేకించారంటే, రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీని నడిపిన అయన తన న్యాయ మంత్రిత్వానికి రాజీనామా చేశారు. తమ స్త్రీలు స్వతంత్రులయితే, కుటుంబంలో తమ అధికారమే కాదు, కులాధిపత్యం కూలిపోతుందని పార్లమెంటులో వున్న ప్రజా ప్రతినిధులందరూ విపరీతంగా భయపడ్డారు.   


కానీ వాళ్ళు భయపడింది క్రమంగా జరగటం మొదలయింది. 1970 లలో హిందీ సినిమాలల్లో ప్రేమ ముఖ్యంగా భూస్వామ్య కుటుంబాలలో కొడుకులు తల్లి తండ్రులని ధిక్కరించే చర్య. తల్లి తండ్రుల అనుమతి చట్రం నుండి బయట పడి తమ స్వతంత్రతని ప్రేమించటం ద్వారా వ్యక్తం చేసుకున్నారు ఆ హీరోలు. అప్పట్లో వచ్చిన వివిధ ప్రగతి శీల ఉద్యమాలలో కులాంతర వివాహాలు ఒక భాగం అయ్యాయి. 1990 లలో చదువుకున్న అమ్మాయిలు కూడా బయటి ప్రపంచాన్ని చూసి, తల్లి తండ్రులు చెప్పిందే సర్వస్వము అనుకోవటం మానేసి, స్వంత నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టారు. 


కొడుకులు చేస్తే వేరే పద్ధతుల్లో నియంత్రించిన ఆధిపత్య కుటుంబాలు కూతుళ్ళ చర్యలని అసలు సహించలేదు, మరీ ముఖ్యంగా కుల నిచ్చెనలో ‘కింది’ కులాల పురుషులని, దళిత పురుషులని పెళ్లి చేసుకుంటే విపరీతమయిన హింసతో వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ మరియు అనేక రాష్ట్రాల్లో కుటుంబాలని  ధిక్కరించి పెళ్లి చేసుకున్న జంటలని కనికరం లేకుండా చంపెయ్యటం చాలా సాధారణం. వాటిల్లో వార్తా పత్రికలకి ఎక్కేవి తక్కువ. వారిని కాపాడటానికి కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి, నిరంతరం పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ప్రేమ పెళ్లిళ్ల చుట్టూ జరిగే ఘర్షణ సమాజంలో ఇంకుతున్న ప్రజాస్వామ్య విలువలకి, మారని ఆధిపత్య విలువలకి జరుగుతున్న ఘర్షణ. 


ఈ చారిత్రక పరిణామాన్ని తెలుగు ప్రధాన స్రవంతి తల్లి తండ్రుల ప్రేమకి, యువతుల బరితెగించిన స్వభావానికి జరుగుతున్న ఘర్షణగా చూపించటానికి చాలా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మారుతీ రావుని తండ్రి ప్రేమకి చిహ్నంగా నిలబెట్టటానికి, దానికి మనందరి అంగీకారాన్ని పొందటానికి తెలుగు సమాజంలో జరుగుతున్న భావోద్వేగ ప్రచారాన్ని, దానికి వస్తున్న మద్దతుని అర్ధం చేసుకోగలం. ఇది ఒక రకంగా అమెరికన్ సివిల్ వార్ లో ఓడిపోయిన దక్షిణాది అమెరికా తెల్ల వాళ్ళు బానిసత్వాన్ని సమర్ధించిన మేమె అమెరికన్ విలువలకి చిహ్నం గా భావించి భావోద్వేగ భరితమయిన రొమాంటిక్ నవలలు రాసుకున్నట్లు, ప్రజాస్వామ్య యుద్ధంలో ఓడిపోతున్న పితృస్వామ్య కుటుంబాలు చేస్తున్న భావోద్వేగ ప్రచారం.  


అందువల్లే అనేక మంది తల్లి తండ్రులు ప్రణయ్ హత్యని బహిరంగంగా సమర్థిస్తున్నారు. తర్కబద్ధంగా ఆలోచిస్తే, ప్రణయ్ - అమ్రిత పెళ్లి తెలుగు సమాజంలో జరిగిన దళిత-ఆధిపత్య కులాంతర వివాహాలలో మొదటిది కాదు, చివరిది అవబోదు. కానీ వారికి  తమ పిల్లల గురించి విపరీతమయిన భయాలున్నాయి. ఎందుకంటే, తమ పిల్లలతో, కూతుళ్లతో వారికి పెద్దగా కమ్యూనికేషన్ ఉండట్లేదు. అమ్మాయిలు స్వతంత్రులయితే తమ మాట వినరన్న భయం, కూతుళ్లతో మనసు విప్పి మాట్లాడలేని అసమర్ధత, సంకోచం. వారి భవిష్యత్తు గురించి వారికి నిర్ణయాలు తీసుకునే సమర్ధత, ఆలోచన లేదనే అపనమ్మకం, ఒక్క తప్పు చేస్తే మొత్తం జీవితం మొత్తం పోయినట్లే అన్న అనాలోచిత ధోరణి, వారిని ఎలాగయినా కట్టడి చెయ్యకపోతే సమాజంలో, కులంలో తమ పెద్దరికాన్ని నిలుపుకోలేమనే భీతి - ఇవన్నీ కలిసి వారిని ఈ భావోద్వేగ చర్చలో పాల్గొనేట్లు చేస్తున్నాయి. వయోజనులయిన, చదువుకున్న కూతుళ్ళ మాటని గౌరవించే స్థితికి రావాలనే అవగాహన కూడా లోపించిన తల్లి తండ్రులకి ఇదంతా యువత చాపల్యం నుండి పుట్టాయనుకోవటం చాలా సౌకర్యంగా కన్పిస్తోంది.


కానీ ఆలోచన లేమి నుండి పుడుతున్న ఈ భావోద్వేగ చర్చ, ప్రచారం మారుతిరావుకి ఏమన్నా ఉపయోగపడిందా? ఆవేశంతో ఊగిపోయిన మద్దతుదారులు అతడికి కూతురి చీత్కారాన్ని తట్టుకునే స్థయిర్యాన్ని ఇవ్వలేదు. ఏ ఆస్తి, పరువు కోసమయితే హత్య చేయించాడో కూతురు ఆ ఆస్తిని వద్దు పొమ్మంది. ఇంటికే రానంది. ఇంకొక తల్లి, తండ్రి ఉసురు పోసుకున్నాననే భీతి నుండి మారుతి రావుకి ఎవరు ఉపశమనం కల్గించలేదు. కుటుంబంలో ఆస్తి తగాదాల నుండి బయట పడలేదు. అల్లుణ్ణి చంపించి, కూతుర్ని దూరం చేసుకుని, ముద్దుగా వున్న మనవడిని ఎత్తుకోలేని పరిస్థితికి వచ్చి, చివరికి తన చావుని తానె కొనితెచ్చుకున్నాడు కదా? 


దెబ్బ తింటున్న కులాధిపత్యం తండ్రులకి కూతుళ్ళ జీవితాలపై పూర్తి అధికారం ఉండాలనే భావానికి తోడయ్యి ప్రణయ్ హత్య తరువాత జరిగిన తెలుగు సమాజంలో జరిగిన చర్చలో నిండు యువకుడి ప్రాణాలని తీసిన చర్య పట్ల కనీస ఖేదం, పశ్చాత్తాపం వ్యక్త పరచనీయ లేదు. ఇక్కడ ప్రణయ్ దళితుడు కావటం యాదృచ్చికం కాదు. దళితుల ప్రాణాలకి విలువనివ్వని సమాజంలో మనం ఎప్పటినుండో బ్రతుకుతున్నాం. కానీ కులాంతర వివాహాలని వేడుకగా కొంత కాలమయినా జరుపుకున్న సమాజ సంస్కృతి నుండి కులాంతర వివాహం చేసుకున్న దళిత యువకుల హత్యలని బహిరంగంగా సమర్ధించే స్థితికి, కూతురి సంతోషాన్ని నాశనం చేసిన క్రూరత్వాన్ని ఆమోదనీయంగా చూసే పరిస్థితికి దిగజారడం చాలా శోచనీయం. మారుతున్న సమాజంలో కూతుళ్లు తండ్రులనుండి ఏమాశిస్తున్నారో అర్ధం చేసుకునే విజ్ఞత, మారే ప్రపంచంలో మారాల్సిన తల్లి తండ్రుల పాత్రలు, తండ్రి ప్రేమని వాస్తవ జీవితంలో వ్యక్తీకరించగలిగే రూపాల గురించి అవగాహన పెంచుకోవటం బదులు, తండ్రి ఉండటమే ప్రేమని, తండ్రి ఏం చేసినా, చివరికి ప్రేమించిన భర్తని హత్య చేయించినా దాన్ని ప్రేమగానే  అర్ధం చేసుకోవాలనే పిడి వాదంలోకి తెలుగు సమాజ ప్రధాన స్రవంతి రావటం ఏ మాత్రం మంచిది కాదు!


Published in the September issue of Matrika magazine.







Comments