On Instant Justice in the case of sexual assaults

ప్రజల ‘సత్వర న్యాయ’ డిమాండుకి స్పందించిన ప్రభుత్వం! 


సెప్టెంబర్ 9 వ తారీఖున సింగరేణి బస్తీలో ఆరేళ్ళ పాప అత్యాచారం, హత్యకి గురయిన సంఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. కొన్ని నెలల క్రితం ఖమ్మంలో ఇంట్లో పని చేసే బాలిక మీద జరిగిన హత్యాచారం, అంతకు ముందు లాక్ డౌన్ సమయంలో అమీన్పూర్ లోని ఒక అనాధ బాలల ఆశ్రమంలో పన్నెండేళ్ల బాలిక లైంగిక దోపిడీ వల్ల చనిపోవటం, మొన్నటికి మొన్న గాంధీ ఆస్పత్రిలో జరిగిన అత్యాచారం అన్నీ కూడా అణగారిన కులాల, వర్గాల బాలికలు, స్త్రీలపై జరిగినవే. వీటిల్లో చాలా వరకు తెలిసిన వాళ్ళు, వారిని సంరక్షించాల్సిన వ్యక్తులు చేసినవే. రోజు రోజుకీ పెరుగుతున్న ఈ సంఘటనలు గమనిస్తే బాలికలు, స్తీలపై, మరీ ముఖ్యంగా అణగారిన సమూహాల వారిపై జరిగే రోజువారీ లైంగిక హింసని మన ప్రభుత్వం, పోలీసు, అధికార వ్యవస్థలు పట్టించుకుంటున్నాయా, అసలు వీటిని లా అండ్ ఆర్డర్ సమస్యగా తీసుకుంటున్నాయా అనే  బలమయిన అనుమానాలని ప్రజల్లో కలుగచేసి అనేక నిరసనలకు దారితీసాయి, తీస్తున్నాయి. 


స్త్రీలపై హింసాత్మక సంఘటనలు - అవి కుటుంబ హింస కావచ్చు, రేప్ కావచ్చు - దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా  తెలంగాణ రాష్ట్రం లోనే ఎక్కువని జాతీయ నేర నమోదు శాఖ  లెఖ్ఖలు తెలుపుతున్నాయి. కోర్టుల్లో పెండింగ్ లో వున్న కేసుల శాతం కూడా ఎక్కువే. ఈ రెండూ, స్త్రీల రెండవ శ్రేణి పరిస్థితిని సూచిండటమే కాకుండా, వారిపై జరిగుతున్న హింస పట్ల  వున్న  రాజకీయ అప్రాధాన్యతని తెలుపుతున్నాయి. ప్రభుత్వ పరంగా షి టీములు, భరోసా సెంటర్లు, సఖి సెంటర్లు ఎన్ని పెట్టినా హింసకి ప్రధాన మూలమయిన పితృస్వామ్య భావజాలాన్ని పాలక పార్టీ ద్వారా పెంచి పోషిస్తున్నప్పుడు దానికి ప్రోత్సాహమే కలుగుతుంది గానీ తగ్గే మార్గాలుండవు. 2019 వరకూ మంత్రి వర్గంలో స్త్రీలు లేరు. ఉన్నత న్యాయస్థానం అక్షింతలు వేసే వరకూ మహిళా కమిషన్ కి అధ్యక్షులని నియమించ లేదు. ఏ వేదిక చూసినా కేవలం పురుషులే నిండా కనిపిస్తారు. ఇక గత రెండేళ్లలో కోవిడ్ పుణ్యమా అని పెరిగిన పేదరికం, నిరుద్యోగం, అవకాశాలు లేకపోవటం వల్ల జరిగిన  అనర్ధాలు మామూలు కావు. వాటిల్లో స్త్రీలపై పెరిగిన హింస ప్రధానమయింది. 


వీటన్నింటి మధ్యలో తెలంగాణ పోలీసులు 2019 లో దిశ అనే హైద్రాబాదు యువతిపై జరిగిన హత్యాచారం తర్వాత ముద్దాయిలని ఎన్కౌంటర్ పేరుతో తుపాకులతో కాల్చి చంపి  స్త్రీలు, బాలికల పై జరిగే హింసకి  సంబంధించిన న్యాయ పాలనలో చట్టాలు, న్యాయవ్యవస్థ కు అతీతంగా  ‘సత్వర న్యాయం’ అనే ప్రక్రియని ప్రారంభించారు. ప్రతి రోజూ ఆగకుండా జరిగే లైంగిక హింసా ఘటనల్లో 99.99 శాతం సంఘటనల్ని ఎవరూ పట్టించుకోరు. నిందితుల్లో తండ్రులు, మామలు, బాబాయిలు, ఇరుగు పొరుగు వాళ్ళు, హాస్టల్ వార్డెన్లు, డాక్టర్లు ఇలా చాలా మందే తెలిసినవాళ్లు వుంటారు. బాధితులు చాలా వరకు బ్రతికి బట్ట కడతారు కూడా. దిశా సంఘటనలో, ఆ యువతీ చనిపోవటం, మధ్య తరగతి అగ్ర కులానికి చెందిన పెళ్లి కాని అందమైన యువతి కావటం వల్ల కావచ్చు, లేదా మన సమాజంలో అత్యాచారమంటే అపరిచిత చిల్లర యువకులు పెళ్లి కాని యుక్త వయసు అమ్మాయిల శీలాన్ని హరించటం అనే భావనకున్న బలం వల్ల  కావచ్చు, నిందితులు దిక్కూ మొక్కూ లేని వారవ్వటం కావచ్చు, జనాభిప్రాయం వారిని భౌతికంగా మట్టుపెట్టడం ద్వారానే లైంగిక దాడులు ఆగుతాయనే భ్రమకి లోనయింది. దిశ తల్లి ఫోన్ చేస్తే పట్టించుకోని పోలీసు వ్యవస్థకి, తమ అసమర్ధతని కప్పిపుచ్చుకోవటానికి వారిని మట్టుబెట్టటం మంచి మార్గంగా కన్పించింది. ఈ ఒక్క చర్యతో జీరోలనుండి హీరోలయ్యారు మన పోలీసులు. హ్రస్వ దృష్టి తో మాత్రమే చూసే దేశ వ్యాప్త జనాభిప్రాయానికి ‘హైదరాబాద్ ఎన్ కౌంటర్’ ఒక స్లోగన్ గా మారింది. 


దురదృష్ట వశాత్తు ఆ నలుగురినీ చంపటంతో అందరూ ఆగిపోతాయని భావించిన లైంగిక దాడులు ఆగలేదు. తండ్రుల దగ్గరినుండి అపరిచితుల వరకూ ఈ దాడులు స్త్రీలు, బాలికల మీద చేస్తూనే వున్నారు. సింగరేణి కాలనీ సంఘటన  ఇలా ఇరుగు పొరుగు మగవాళ్ళు  చేసిన దాడుల్లో ఒకటి. ఆరేళ్ళ పాప చనిపోవటం, మీడియా నుండి ప్రజా సంఘాల వరకూ, పవన్ కళ్యాణ్ నుండి షర్మిల వరకూ అందరూ దీన్ని ఒక ప్రభుత్వ వైఫల్యంగా చూడడం తో ఇదొక ‘పరువు’ సమస్యగా ప్రభుత్వానికి పరిణమించింది. ఎన్కౌంటర్ చేసేస్తామని టిఆర్ఎస్ మంత్రి మల్లా రెడ్డి, ఆయనకి తీసిపోకుండా ప్రతిపక్ష నాయకుడు  రేవంత్ రెడ్డి ఉన్మాదంతో  ఊగిపోయారు. పబ్లిక్ గా ఉరి తియ్యాలని, ఎంకౌంటర్ చెయ్యాలని కొన్ని సంఘాలు బానర్లు కూడా పెట్టుకున్నాయి. ట్విట్టర్లో కూడా అనేక మంది ఇలాగే వీరంగం చేశారు. ఎన్కౌంటర్ ‘చెయ్యటం’ చట్ట రీత్యా జరగకూడదని, ఇటువంటి కోరికలు చట్ట రాహిత్యాన్ని డిమాండు చేస్తున్నాయనే స్పృహ పూర్తిగా కరువయింది. 

 

అయితే ఇక్కడ ప్రభుత్వానికి చిన్న సమస్య ఎదురయింది. దిశా కేసులో నిందితులని నిజంగానే ఎన్కౌంటర్లో చంపారా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవటానికి జస్టిస్ వి. సిర్పుర్కర్ నేతృత్వంలో సుప్రీమ్ కోర్టు నియమించిన జ్యూడిషియల్ కమిషన్ గత నెల రోజులుగా తెలంగాణ హై కోర్టు ప్రాంగణంలోనే విచారణ చేస్తోంది. 1970లలో ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఎన్కౌంటర్ లపై వేసిన భార్గవ కమిషన్ తర్వాత, 1996 లో జాతీయ మానవ హక్కుల కమిషన్ అప్పటి ఎన్కౌంటర్లపై జరిపిన విచారణ తర్వాత సుప్రీమ్ కోర్టు మన రాష్ట్రంలో ఎన్కౌంటర్లపై వేసిన కమిషన్ ఇదే. కమిషన్ ముందు హాజరయిన దిశా కేసులో పాల్గొన్న పోలీసులు చెప్పేదానికి, రికార్డులో వున్నదానికి పొంతన కరువయిందాని వైర్, టైమ్స్ అఫ్ ఇండియా, ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ పత్రికలు క్రమం తప్పకుండా  రిపోర్టు చేస్తున్నాయి. 


ఇలా దిశా కేసులో జరిపిన ‘సత్వర న్యాయం’ విచారణకి రావటంతో సింగరేణి నిందితుడు రాజుకి జనాభిప్రాయం కోరుకున్న అదే సత్వర న్యాయం అందించటం ప్రభుత్వానికి కష్టతరమయిపోయింది. అందుకే రాజు ‘ఆత్మహత్య’ పేరుతో రైలు పట్టాల మీద తేలాడు. ఆ వెంటనే పోస్టు మార్టమ్, శవదహనం కూడా ఎవరో వెంటబడినట్లు త్వరత్వరగా జరిగిపోయాయి కూడా. ఇలా సింగరేణి చిన్నారికి కూడా దిశకి జరిగిన ‘న్యాయం’, కొద్దిపాటి మార్పులతో లభించింది. జనాభి ప్రాయానికి సత్వర న్యాయం పేరుతో కోరుకున్న ప్రతీకారం లభిస్తే, ప్రభుత్వానికి పరువు కూడా దక్కింది. 


అయితే కొన్ని ప్రశ్నలు మాత్రం మిగిలిపోయాయి. దిశా కేసులో ‘సత్వర న్యాయం’ ఇవ్వని ఫలితాలు సింగరేణి చిన్నారి కేసులో జరిగిన సత్వర న్యాయం ఇస్తుందా? పలుకుబడి, పరువు, ప్రతిష్ట వున్న మగాళ్లు లైంగిక దాడులు లకు పాల్పడినప్పుడు కూడా ‘సత్వర న్యాయం’ అమలు జరుగుతుందా లేక ఇదంతా దిక్కు, మొక్కు లేని యువకులకు మాత్రమే పరిమితమయిందా? ఇలా న్యాయ వ్యవస్థ బయట ‘సత్వర న్యాయం’ అమలవుతున్నప్పుడు పకడ్బందీగా మందీ మార్బలంతో నేర విచారణ చెయ్యటానికి నెలకొల్పబడిన పోలీసు డిపార్టుమెంటులు, న్యాయ వ్యవస్థలు, నేరస్థులకు జైళ్లు ఎందుకున్నట్లు? అసలు ఎన్ కౌంటర్ డిమాండులు ప్రజా ప్రతినిధులు చేస్తుంటే, న్యాయస్థానం వారిని హెచ్చరించకుండా ఎందుకు కళ్ళుమూసుకు కూర్చుంది? పౌర హక్కుల సంస్థలు, మహిళా సంఘాలు ఈ విషయాన్ని ఉన్నత న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎందుకు స్పందించలేదు? శతాబ్దాల మధనంతో నిర్మింపబడుతూ వచ్చిన ఆధునిక, రాజ్యాంగ బద్ధ వ్యవస్థని ఈ సత్వర న్యాయం పేరుతో నీరు కార్చటం ఏ రకమయిన సమాజానికి, ప్రజాస్వామ్యానికి దారితీస్తోంది? 


మూడు రోజుల క్రితం తెలంగాణ హై కోర్టు క్రిమినల్ కోర్టుల్లో ఎప్పటినుండో ఖాళీగా వున్న పబ్లిక్ ప్రోసిక్యుటర్ పోస్టుల గురించి, వాటిని నింపటంలో ప్రభుత్వం కనపరుస్తున్న తీవ్ర అలసత్వాన్ని గురించి ప్రశ్నించింది. అనేక మహిళా కోర్టుల్లో, పోక్సో కోర్టుల్లో పూర్తి స్థాయి జడ్జీలు లేరు. కోర్టుల కెళ్లే స్త్రీలు న్యాయం కోసం సంవత్సరాలు వేచి చూడాలని అందరికీ తెలిసిందే. కోర్టులు, పోలీసు స్టేషన్లని బల పరిచి స్త్రీలపై జరుగుతున్న నేరాల విచారణ సమర్ధవంతంగా జరిగేటట్లు చూడటం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులని సిద్ధపరచటం వెంటనే చేపట్టాల్సిన చర్యలు. స్త్రీలపై, బాలికలపై జరిగే లైంగిక హింసని ఎదుర్కోవటానికి సమర్ధవంతమయిన విచారణ, త్వరిత గతిన నేరస్థులకు శిక్షలు పడేటట్లు చూడటం మాత్రమే దీనికి తగిన పరిష్కారం తప్ప ఇలా సత్వర న్యాయం పేరుతో `అనాలోచిత చర్యలకి పాల్పడటం కాదు! 


Published in Andhra Jyothy in December 2021


Comments